ఆగస్టు 10 జైల్ భరోను జయప్రదం చేయాలి : సీఐటీయూ
ఆగస్టు 10 జైల్ భరోను జయప్రదం చేయాలి : సీఐటీయూ
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న నిర్వహించే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ పిలుపునిచ్చారు. చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్, రైస్మిల్లు, భవన నిర్మాణ, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ల నాయకులతో కలిసి ఆయన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, ఏళ్ల మారయ్య, బండారు శంకరయ్య, గోధుమగడ్డ వెంకట్ రెడ్డి, చిర్రబోయిన గట్టయ్య, అవిశెట్టి నర్సింహా, గుడిసె లక్ష్మీనారాయణ, జిట్ట స్వామి, బొడ్డు బాబురావు తదితరులు పాల్గొన్నారు.