ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి
తెలంగాణ గిరిజన సంఘం గోడపత్రిక ఆవిష్కరణ
హైదరాబాద్ ఆగస్టు 07/ ఏన్ టుడే న్యూస్.
తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని 13వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్ లు తెలిపారు. దినోత్సవానికి సంబంధించిన గోడపత్రికను హైదరాబాద్ సంతోష్ నగర్ లోని గిరిజన సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 9 న గిరిజన తెగలు తమ హక్కుల కోసం ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి 1994లో తీర్మానం చేసిందని అన్నారు.కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాల వలన గిరిజన తెగల ఉనికి తీవ్ర ప్రమాదంలో పడుతోందన్నారు. రాజ్యాంగంలో ఆదివాసి గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాసే విధంగా చట్టాలను మారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల నుండి గిరిజనులను బలవంతంగా గెంటి వేసేందుకు అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023 ను తీసుకొచ్చిందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని విలువైన అటవీ, ఖనిజ సంపదను అంబానీ ఆదానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్ట పెట్టే విధంగా చట్టాల్లో పొందుపరిచారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసి గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలపై మనువాద సంస్కృతిని రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
గిరిజన తెగల ఉనికిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 2027లో చేపట్టబోయే జనాభా లెక్కల కాలంలో మతం అనే పేరాలో షెడ్యూల్ ట్రైబ్ విశ్వాసాలు లేక ప్రకృతి ఆరాధికులు అనే ప్రత్యేక కాలాన్ని పొందుపరచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన 16 రకాల వాగ్దానాలను తక్షణం అమలు చేసేందుకు తక్షణం కార్యాచరణ ప్రకటించాలన్నారు.ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ గిరిజనులను మోసం చేస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షులు వి.రాంకుమార్, కార్యదర్శి ఎం.బాలు నాయక్,నాయకులు ఆంగోత్ కృష్ణా నాయక్, ఎస్ కిషన్ నాయక్, రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం గోపీ నాయక్,మోహన్,బిందు ఆర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.