అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. ముగ్గురు అరెస్ట్
అన్నమయ్య జిల్లా | రామాపురం | Ntoday News
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో కలకలం రేపింది. గండ్లపల్లికి చెందిన బాలకృష్ణ హత్య కేసులో భార్య రావి చిన్నక్క, ఆమె ప్రియుడు రఫీ, అతని స్నేహితుడు నవీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న బాలకృష్ణ మద్యం సేవించే సమయంలో అందులో విషపు గుళికలు కలిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే విషపు గుళికలు కలిపిన మద్యం తాగినప్పటికీ బాలకృష్ణ మృతి చెందకపోవడంతో, నిందితురాలు తన ప్రియుడు రఫీ, అతని స్నేహితుడు నవీన్తో కలిసి అతడిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.
అనంతరం బాలకృష్ణ మెడకు విద్యుత్ వైరు బిగించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లి పరిధిలోని వ్యవసాయ బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదింపు
బాలకృష్ణ అదృశ్యం, హత్యకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
నిందితుల నుంచి 70 అడుగుల విద్యుత్ వైరు, ఒక స్కూటీ, ఒక హెల్మెట్, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించారు. కేసు దర్యాప్తులో సీఐ, గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.