భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కేసు రిమాండ్ రిపోర్ట్ మార్పు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కేసు రిమాండ్ రిపోర్ట్ మార్పు.. ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్
గంజాయి కేసులో నిందితుడు స్టేషన్ నుంచి పరారైన ఘటనలో రిమాండ్ రిపోర్ట్ మార్చిన భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహిమున్నీసా బేగంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కొద్ది రోజుల క్రితం గంజాయి పట్టుకున్న కేసులో నిందితులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అయితే స్టేషన్లో ఉన్న సమయంలో ఒక నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు పలు అంశాలను పరిశీలించారు.
కేసుకు సంబంధించిన పంచనామా వివరాలను మార్చి, కేవలం ఒక నిందితుడిని మాత్రమే కోర్టులో హాజరుపరిచినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. పంచనామా, ఎఫ్ఐఆర్లోని అంశాలపై లోతుగా పరిశీలించిన అనంతరం సీఐ రహిమున్నీసా బేగంపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.