మధిరలో నిరుపేదలకు ఉచితంగా పాతబట్టలు, సామాన్ల పంపిణీ
మధిరలో నిరుపేదలకు ఉచితంగా పాతబట్టలు, సామాన్ల పంపిణీ
మధిర టౌన్, ఆగస్టు 30: మానవ సేవే భగవంతుని సేవ అనే భావనతో నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లంకా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా పాతబట్టలు, సామాన్లు పంపిణీ చేశారు.
మధిర పట్టణంలోని అజాద్ రోడ్డులో లంకా కొండయ్య నివాసం వద్ద ఆదివారం ఉదయం మహాత్మాగాంధీ ఉచిత పాతబట్టల కేంద్రం, హెల్పింగ్ హోమ్ ద్వారా వివిధ దాతలు అందించిన వస్త్రాలు, గృహ సామగ్రిని సంచార జాతులకు చెందిన పేద కుటుంబాలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సీపీఎం నాయకులు శీలం నర్సింహారావు చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా శీలం నర్సింహారావు తన ఇంట్లోని అదనపు దుస్తులను కూడా వితరణ చేశారు.
ఈ సేవా కార్యక్రమానికి మడుపల్లి చెందిన సాగి వెంకట్రావమ్మ, మధిర సీపీఎం మహిళా నాయకులు మండవ ఫణీంద్ర కుమారి, మధిర నివాసి చావా నర్సింహారావు, అజాద్ రోడ్డుకు చెందిన మన్నే ప్రభాత్ పార్వతి దంపతులతో పాటు పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు దుస్తులు, సామాన్లు అందించారు.
దాతలు అందించిన వస్తువులను లంకా సేవా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా శీలం నర్సింహారావు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో లంకా సేవా ఫౌండేషన్ సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.