22ఏ భూముల అంశంపై అధికారుల్లో ఆందోళన...
22ఏ భూముల అంశంపై అధికారుల్లో ఆందోళన.. నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు కసరత్తు
హైదరాబాద్: 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల అంశంపై ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కమిషనర్ లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించినట్లు తెలుస్తోంది.
నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన భూములను పరిశీలించి వెంటనే తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు సమాచారం. కలెక్టర్ల పరిధిలో లేని, సీసీఎల్ఏ పరిధిలోకి వచ్చే భూముల తొలగింపునకు కూడా ప్రతిపాదనలు పంపాలని సూచించినట్లు తెలిసింది.
ఆదివారం దాదాపు మూడు గంటల పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల వారీగా 22ఏ భూముల వివరాలు, పెండింగ్ అంశాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.
ఇటీవల 22ఏ అంశంపై బీఆర్ఎస్ నేతలు ప్రజల తరఫున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, త్వరలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
అయితే 22ఏ భూముల వ్యవహారంలో గతంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుతం జరుగుతున్న మార్పులపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.