అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ .. రూ.3.25 లక్షల నగదు స్వాధీనం
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ .. రూ.3.25 లక్షల నగదు స్వాధీనం
నల్గొండలో ఇటీవల చోటుచేసుకున్న పగటి చోరీల కేసులను ఛేదించిన పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఓ నిందితుడిని అరెస్టు చేసి రూ.3.25 లక్షల నగదు, స్కూటీతో పాటు చోరీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ జి. రమేష్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్టౌన్ సీఐ ఎం. రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ కె. ఆది రెడ్డి, ఎస్ఐ సైదా బాబు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం పానగల్ బైపాస్ వద్ద ఢిల్లీకి చెందిన మహమ్మద్ నసీమ్ (48)ను అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నిందితుడు నల్గొండతో పాటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి జిల్లాలు, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, ఢిల్లీలో జరిగిన పలు చోరీ కేసుల్లో తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.3.25 లక్షల నగదు, డీఎల్-5ఎస్-డీఎస్-1374 నంబర్ స్కూటీ, రెండు ఇనుప రాడ్లు, మాస్క్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఇర్షాద్, షరీఫ్ పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు చేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐలు డి. సైదా బాబు, ముత్తయ్య, జి. మానసతో పాటు పోలీసు సిబ్బంది రబ్బాని, శంకర్, అంజద్, లావూరి బాలకోటి, మహమ్మద్ షకీల్, జానకిరాములు, హోం గార్డ్ శ్రీనులను జిల్లా ఎస్పీ అభినందించారు.