అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
విజయవాడ నగరపాలక సంస్థ
అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరంలో చేపడుతున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి, వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా గాయత్రీనగర్, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, పటమట హైస్కూల్ రోడ్ తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో నీటి నిల్వల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పటమట హైస్కూల్ రోడ్లోని అన్న క్యాంటీన్ను పరిశీలించారు. అక్కడ అందిస్తున్న ఆహార నాణ్యత, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అన్న క్యాంటీన్ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, ప్రతిరోజూ నిర్ణీత సమయాల్లో సేవలు అందించాలని సూచించారు. క్యాంటీన్కు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గోపాల్ నాయక్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ