మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ | ntodaynews.com
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో కండ్రిక–పాతపాడు రోడ్డు వంతెన సమీపంలో నిర్మించనున్న మస్జిద్-ఎ-ఇలియాస్ మస్జిద్ శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మార్కస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ మస్జిద్ నిర్మాణానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మార్కస్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా ముస్లిం సమాజానికి ఆధ్యాత్మిక, సామాజిక సేవలు అందిస్తూ విశేష కృషి చేస్తోందని అభినందించారు. మత సామరస్యాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో ఈ సంస్థ పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో మస్జిద్ నిర్మాణం చేపట్టడం శుభపరిణామమని అన్నారు. మస్జిద్ నిర్మాణానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
స్థానికుల అభ్యర్థన మేరకు రహదారి, తాగునీటి సదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మస్జిద్ నిర్మాణం పూర్తయ్యాక ప్రార్థనలు నిర్వహించేందుకు ఇది ఆదర్శవంతమైన ప్రార్థనా కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు.
మైనారిటీ సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్న ఆయన, గతంలో కూడా పలు మస్జిద్ల అభివృద్ధికి సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ముస్లిం సమాజానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల సలహాదారులు, మైనారిటీ కార్పొరేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, స్థానిక నాయకులు, భక్తులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.