చనుబండ లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 72వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని రెండో బూత్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ క్రియాశీలక సభ్యులు,కొత్తగుండ్ల రమేష్,నెక్కలపు విజయలక్ష్మి అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నెక్కలపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారత జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన మహనీయుడని పేర్కొన్నారు. 1901 జూలై 6న కలకత్తాలో జన్మించిన ఆయన విద్యావేత్తగా, న్యాయవేత్తగా, రాజకీయ నాయకుడిగా విశేష సేవలందించారని గుర్తు చేశారు. కేవలం 33 ఏళ్ల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టడం ఆయన మేధస్సుకు నిదర్శనమని అన్నారు.
1943లో బెంగాల్లో సంభవించిన భయంకర కరువు సమయంలో ప్రజల కష్టాలను చూసి బ్రిటిష్ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ప్రశ్నించిన నాయకుడు ముఖర్జీ అని తెలిపారు. బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి స్వయంగా సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యానంతరం తొలి కేంద్ర మంత్రివర్గంలో పరిశ్రమలు, సరఫరాల శాఖ మంత్రిగా సేవలందించిన ఆయన, దేశ పారిశ్రామిక విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం సిద్ధాంతాల కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి 1951లో భారతీయ జనసంఘ్ స్థాపనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అదే సంస్థ తరువాత భారతీయ జనతా పార్టీగా విస్తరించి దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు.
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ “ఒకే దేశంలో రెండు విధానాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండవు” అనే నినాదంతో ఆయన చేపట్టిన ఉద్యమం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. 1953లో కాశ్మీర్లో నిర్బంధంలో ఉన్న సమయంలో జూన్ 23న ఆయన మరణించారని తెలిపారు.
2019లో ఆర్టికల్ 370 రద్దుతో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల సాకారమైందని నాయకులు అభిప్రాయపడ్డారు. పదవుల కోసం కాకుండా సిద్ధాంతాల కోసం జీవించిన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. కార్యక్రమం ముగింపులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.