సంస్థాగత పార్టీ బలోపేతమే లక్ష్యం.. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే మా గమ్యం: గద్దె అనురాధ
విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, ఓటరు నమోదు కార్యక్రమాలు, అలాగే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం అమలుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ పార్టీ స్థాయిల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, కమ్యూనికేషన్ను మెరుగుపరచడం, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల నుంచి వచ్చే సమస్యలను జిల్లా స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని అంశాలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు.
‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా గత రెండేళ్లలో ప్రభుత్వం, పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, వారి సమస్యలను తెలుసుకుని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అందజేసిన నియోజకవర్గాల వారీ తీర్మానాలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపనున్నట్లు తెలిపారు.
ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమాల్లో బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు), బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, ఓటర్ల జాబితాలో స్పెల్లింగ్ తప్పిదాలు వంటి సాంకేతిక సమస్యల పరిష్కారంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అర్హుడి ఓటు నమోదు కావడంతో పాటు, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం, ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాల విజయవంతమైన అమలుపై దృష్టి సారించామన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని నమోదు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
టిడిపి జోనల్ కోఆర్డినేటర్ మంతెన వెంకట సత్యనారాయణ రాజు మాట్లాడుతూ క్లస్టర్ల వారీగా పర్యవేక్షణ కోసం ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నాయకుల ఆదేశాలను పాటిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్, గద్దె రామ్మోహన్, కార్పొరేషన్ చైర్మన్లు కసునూరి నాగుల్ మీరా, గొట్టుముక్కల రఘురామరాజు, శావల దేవదత్, ఎరుబోతు రమణారావు, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ధరణికోట విజయలక్ష్మి, తాళ్లూరు రామారావు, చలసాని రమణారావు, బొద్దుకుళ్ల ప్రేమరాజు, నాదెళ్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు.