ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం
విజయవాడ | ntodaynews.com
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని దుర్గాఅగ్రహారం, ఏలూరు రోడ్డులో ఉన్న ఎన్ఆర్హెచ్ జనరిక్ మెడిసిన్ స్టోర్లో జెనివిస్ రెమిడీస్ మోడల్ ఫ్రాంచైజీ మరియు విజయవాడ రీజినల్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్స్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
జనరిక్ మందులు మరియు బ్రాండెడ్ మందుల మధ్య నాణ్యత పరంగా ఎలాంటి తేడా ఉండదని, ఒకే ప్రమాణాలతో తయారయ్యే జనరిక్ మందులు 80 నుంచి 90 శాతం వరకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు అవసరమైన మందులు కూడా జనరిక్ రూపంలో లభిస్తున్నాయని చెప్పారు.
ప్రజలు జనరిక్ మందులపై అవగాహన పెంచుకుని వాటిని వినియోగించడం ద్వారా వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచించారు. మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో లభించేందుకు జనరిక్ మెడిసిన్ స్టోర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మెడిసిన్ స్టోర్ల విస్తరణ ద్వారా ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నారని పేర్కొన్న ఆయన, జెనివిస్ రెమిడీస్ సంస్థ మరిన్ని ప్రాంతాల్లో సేవలను విస్తరించి ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
అనంతరం స్టోర్ నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.