గొల్లపల్లిలో విత్తన మేళా ప్రారంభం - రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సన్న రకాల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- గొల్లపల్లిలో విత్తన మేళా ప్రారంభం
- రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గొల్లపల్లి: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ రైతు వేదికలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఆయన విత్తన మేళా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం, మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, అధికారుల సమన్వయంతో పంటలను కొనుగోలు చేసి, నాలుగు ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. వానాకాలం సీజన్లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల విత్తనాలను మాత్రమే సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
అభివృద్ధి పనుల వెల్లువ
శ్రీరాములుపల్లి గ్రామంలో రూ. 70 లక్షలతో ప్రమాదకరమైన విద్యుత్ తీగలను తొలగించామని మంత్రి తెలిపారు. గ్రామంలోని ఐకేపీ సెంటర్, గ్రౌండ్ ప్రతిపాదనలను పరిశీలించామని, మిగిలిన సీసీ రోడ్లు, సంఘ భవనాల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
భూసారాన్ని కాపాడుకుందాం: జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, యూరియా నిల్వలకు కొత్త యాప్ ద్వారా పారదర్శకమైన వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. అధికంగా యూరియా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని హెచ్చరించారు. మార్కెట్లో డిమాండ్ లేని రకాలకు బదులుగా సన్న వడ్ల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
ఈనెల 31 వరకు విత్తన మేళాలు
జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ, ఈనెల 23 నుంచి 31 వరకు జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు