జులై 1 నుంచి ఈ-రవాణా విధానం అమలు.. మాన్యువల్ పర్మిట్లకు స్వస్తి: ఏపీ రవీంద్ర
కడప జిల్లా మైదుకూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఏపీ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ-రవాణా విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జులై 1వ తేదీ నుంచి చెక్పోస్టుల వద్ద నగదు వసూలు చేసి రసీదులు జారీ చేసే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ లైసెన్స్ కలిగిన వ్యాపారులు స్వయంగా ఆన్లైన్లో ఈ-రసీదు లేదా పర్మిట్ పొందించి, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే వాహనదారులకు అందజేసి పంపాలని కోరారు. మార్కెట్ యార్డుల ఆదాయాలను పెంచడం, పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు వ్యవసాయ, వాణిజ్య పంటల రవాణాకు అధికారులు మాన్యువల్ పద్ధతిలో పర్మిట్లు జారీ చేసేవారని, ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి ఆన్లైన్ ద్వారానే పర్మిట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ-రవాణా విధానం అమలుతో అక్రమాలు, లోపాలకు అడ్డుకట్ట పడటంతో పాటు చెక్పోస్టుల వద్ద అవకతవకలు తగ్గుతాయని చెప్పారు.
ట్రేడ్ లైసెన్సులు లేకుండా లేదా సరైన పర్మిట్లు లేకుండా సరుకుల రవాణా చేసే వారు చెక్పోస్టు సిబ్బందిని తప్పుదారి పట్టించే అవకాశాలను నివారించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి సెస్ రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైదుకూరు మార్కెట్ యార్డు సిబ్బంది, రైస్ మిల్ యజమానులు, విత్తన వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.