నూజివీడు బైపాస్ పనులు వేగవంతం చేస్తామని హామీ.. మంత్రిని సన్మానించిన రైతులు
నూజివీడు పట్టణ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మైలవరం రోడ్డు నుంచి విస్సన్నపేట రోడ్డును కలుపుతూ ప్రతిపాదిత బైపాస్ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, భూములు కోల్పోయిన రైతులకు రావలసిన పరిహార నిధులను వెంటనే విడుదల చేయిస్తానని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ఈ నేపథ్యంలో బైపాస్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఏనుగుల వెంకటేశ్వరరావు, లాయర్ కుమార్, గోళ్ల వాసు, గోళ్ల వెంకటేష్, పిట్ల రాజా, చిట్టూరి సోమశేఖర్, ఏనుగుల చక్రి తదితరులు గురువారం మంత్రి కొలుసు పార్థసారథిని ఆయన స్వగృహంలో కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా బైపాస్ నిర్మాణం పూర్తయితే నూజివీడు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వారికి హామీ ఇచ్చారు.