బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలోని నలుగురు మృతి
సిద్దిపేట జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులు సహా కుటుంబం జల సమాధి
అర్ధరాత్రి అదుపుతప్పిన కారు.. అప్పన్నపల్లి శివారులో ఘోర ప్రమాదం
సిద్దిపేట జిల్లా, ఆగస్టు 20:
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో అర్ధరాత్రి సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
మృతులను దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన రాజు (30), ఆయన భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్స్ (4), కుమార్తె శాన్విక (2)గా పోలీసులు గుర్తించారు. బంధువు దశదిన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అప్పన్నపల్లి శివారులోకి రాగానే కారు అదుపు తప్పి సమీపంలోని లోతైన బావిలో పడిపోయింది. కొంతసేపటి తర్వాత స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన అధికారులు స్థానికుల సహాయంతో క్రేన్ ద్వారా కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నీటిలో మునిగిపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బలవంతపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.