ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని విస్సన్నపేట, కొండపర్వ గ్రామాల సొసైటీల వద్ద శుక్రవారం రైతులకు ఎల్ నినో ప్రభావంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వాతావరణ మార్పులు, పంటలపై వాటి ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
ఈ సందర్భంగా ఏడీఏ శశికళ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి వినియోగాన్ని పొదుపుగా నిర్వహించడంతో పాటు తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలని, వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏవో రాజ్యలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఏఈవోలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.