చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట | NTODAY NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
బుధవారం రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్తో కలిసి చిలకలూరిపేట పట్టణంలోని 11, 29 వార్డుల్లో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం యడ్లపాడు, నాదెండ్ల గ్రామాల్లో కూడా పింఛన్లు పంపిణీ చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 65 లక్షల కుటుంబాలకు సామాజిక పింఛన్లు అందుతున్నాయని, మిగతా కుటుంబాలకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. రాష్ట్రంలోని దాదాపు 80 శాతం కుటుంబాలు ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్నాయని పేర్కొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోనే ప్రతి నెలా సుమారు రూ.4.75 కోట్ల విలువైన సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని ఆయన అన్నారు.
రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీతో పేద కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంటోందన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గాలు, పార్టీలు, ఓట్లకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.