వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం నగరంలోని ఎర్రకట్ట, సీవీఆర్ ఫ్లైఓవర్, మిల్క్ ప్రాజెక్ట్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, కనకదుర్గ ఫ్లైఓవర్, సితార జంక్షన్, తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సీవీఆర్ ఫ్లైఓవర్ కింద రహదారికి ఇరువైపులా ఉన్న ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్లలో తేలియాడే వ్యర్థాలను తొలగించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లు, కాలువల్లో డీ-సిల్టింగ్, తేలియాడే వ్యర్థాల తొలగింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రహదారులపై వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైన్లలో నీటి ప్రవాహం సాఫీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం సితార జంక్షన్లోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. పాడైపోయిన డ్రైన్ స్థానంలో వెంటనే నూతన డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొండ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరంతా సక్రమంగా డ్రైన్ ద్వారా వెళ్లేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
తదుపరి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులోని అన్న క్యాంటీన్ను పరిశీలించి అక్కడి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. తాగునీటి సరఫరా, వినియోగ నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. క్యాంటీన్ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదని, ప్రజల నుంచి ఏవైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి, సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు జె.శ్రీనివాస్, గోపాలకృష్ణమూర్తి, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ