Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు
విజయవాడ | NTODAY NEWS
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం హెచ్బీ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని పరిశీలించి వైద్య సిబ్బంది సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని అన్నారు. చిన్నారులకు వేయించే రెండు పోలియో చుక్కలు వారి జీవితానికి రక్షణగా, ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.