TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
NTODAY NEWS: పల్నాడు జిల్లా గణపవరం గ్రామంలో నిర్వహిస్తున్న 'సర్' (ఓటర్ల సమగ్ర జాతీయ సర్వే) కార్యక్రమాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓల పనితీరును సమీక్షించి, స్వయంగా ఓటరు నమోదు ఫారాన్ని అందజేశారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ఎంత ముఖ్యమో, అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఓటర్ల తుది జాబితా ఖరారయ్యే వరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బీఎల్ఏల పనితీరును గ్రామ, మండల నాయకులు ప్రతిరోజూ సమీక్షించాలని, బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సేవాభావం, పట్టుదల, క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలకు పార్టీ అధినాయకత్వం వద్ద సరైన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులు ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజాహిత కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని, జాబ్ మేళాలు, ఉచిత వైద్య శిబిరాలు, అభివృద్ధి పనుల వంటి కార్యక్రమాలపై ప్రచారాన్ని మరింత పెంచాలని సూచించారు.
ఈ సమావేశంలో టీడీపీ అబ్జర్వర్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.