Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
విజయవాడ | జూన్ 28 | NTODAY NEWS
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ మధురానగర్ హెల్త్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన 'పల్స్ పోలియో–2026' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను పరిశీలించిన వారు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, పోలియో వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తిగా నిర్మూలించడంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు ఐదేళ్లలోపు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.
పోలియో నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో పోలియో కేంద్రాల ఏర్పాటు వంటి చర్యల వల్ల దేశం పోలియో రహితంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పోలియో మళ్లీ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
మంత్రి సవిత మాట్లాడుతూ, ప్రతి చిన్నారి ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదని అన్నారు. ఐదేళ్లలోపు ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలతో పాటు మొబైల్ బృందాల ద్వారా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గ్రామాలు, పట్టణాల్లో కూడా పోలియో చుక్కలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో ఆంధ్రప్రదేశ్ను శాశ్వతంగా పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ సింగం వెంకన్న, స్థానిక నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.