ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని
అభివృద్ధి ఆగదు... ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)
గుణదల ప్రజలకు రూ.98.68 కోట్ల అభివృద్ధి కానుక ,– దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం
విజయవాడ(సెంట్రల్ నియోజకవర్గం)
ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలో చూపిస్తూ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) మరో కీలక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దశాబ్దాలుగా గుణదల–నున్న ప్రాంత ప్రజలను వేధిస్తున్న రైల్వే గేటు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.98.68 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ)కి సోమవారం ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఎన్నికల సమయంలో గుణదల ప్రజలకు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తానని హామీ ఇచ్చిన కేశినేని చిన్ని, ఆ మాటను ఏడాది వ్యవధిలోనే నిలబెట్టుకోవడం స్థానిక ప్రజల్లో విశేష చర్చనీయాంశంగా మారింది. ఈ శంకుస్థాపనతో "మాటలు కాదు, చేతలే" అనే సందేశాన్ని ఆయన మరోసారి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ కేశినేని చిన్ని, "గుణదల ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రోజు ఇదని, ఈ ఆర్ఓబీ పూర్తయితే గుణదల–నున్న ప్రాంతాల రాకపోకలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తన బాధ్యత అనీ అభివృద్ధి ఆగదనీ, డబల్ ఇంజిన్ సర్కారుతో తమ ప్రయాణం కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.
విజయవాడ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న అన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జిలను దశలవారీగా పూర్తి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావుతో సమన్వయం చేసుకుంటూ ఉలవచారు కంపెనీ సమీపంలో మరో ఆర్ఓబీకి కూడా త్వరలో శంకుస్థాపన చేసి, రెండేళ్లలో పూర్తయ్యేలా పర్యవేక్షిస్తామని వెల్లడించారు.
గుణదల రైల్వే లెవెల్ క్రాసింగ్ నంబర్–316 వద్ద రోజూ సుమారు 170 రైళ్లు రాకపోకలు సాగుతుండటంతో గేటు దాదాపు 14 నుంచి 16 గంటల పాటు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. వేలాది మంది వాహనదారులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్ఓబీ పూర్తయిన తర్వాత ప్రస్తుతం 15 నుంచి 20 నిమిషాలు పట్టే నిరీక్షణ సమయం దాదాపు నిమిషానికి తగ్గనుంది. ట్రాఫిక్ సమస్య పూర్తిస్థాయిలో తొలగి రాకపోకలు సులభతరం కానున్నాయి.
రూ.98.68 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఆర్ఓబీ 920 మీటర్ల పొడవుతో, 18 స్పాన్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర రైల్వే శాఖతో పలుమార్లు చర్చలు జరిపి, ప్రజల సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేశామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గుణదల ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం ద్వారా "మాట నిలబెట్టుకునే నాయకుడు"గా ఎంపీ కేశినేని చిన్ని మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. గుణదల ఆర్ఓబీ శంకుస్థాపన విజయవాడ అభివృద్ధి చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలవనుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు ఏ డి ఆర్ ఎమ్ ఎడ్విన్,సైమన్, డీ సీ ఎమ్ ప్రశాంత్ కుమార్,సీనియర్ ఇంజినీర్ ఎస్ శ్రీనివాసరావు, రమణారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక టీడీపీ నాయకులు,సీనియర్ నాయకులు బొప్పన భవ కుమార్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు,రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాసరి ఉదయశ్రీ,కె కిరణ్, రఘురామరాజు,గురునాధం,భవకుమార్,కరీముల్లా,సాయి చరణ్,ఉషారాణి,సంజయ్ వర్మ,వల్లభనేని సతీష్,రేగేళ్ల లక్ష్మణరావు, పిళ్లా శ్రీనివాసరావు, ఆషా, మాల్యాద్రి,తదితరులు పాల్గొన్నారు.