Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ
విజయవాడ | NTODAY NEWS
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన రైతు భక్త బృందాలకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి, అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT) మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కో-ఆర్డినేటర్ కరి రమాసుందరి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా మహిళలు కోట్ల సంఖ్యలో చేసిన రామనామ జపంతో పవిత్రీకరించిన వడ్లను రైతు మహిళలకు పసుపు, కుంకుమతో పాటు సౌభాగ్య కానుకలుగా అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అలాగే భూసూక్తం, నీలాసూక్తం, వరుణసూక్తం పారాయణాలతో ప్రకృతి ఆరాధన చేపట్టి, వ్యవసాయ సీజన్ విజయవంతంగా సాగాలని సంకల్పించారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా ప్రతినిధులు, ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో రైతు మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.