Yadadri: బొమ్మలరామారం తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ దీపాలు లేవు.. భద్రతపై ఆందోళన
యాదాద్రి భువనగిరి | NTODAY NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో భద్రతపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కీలక రెవెన్యూ రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లు కార్యాలయంలో భద్రపరచబడిన నేపథ్యంలో తగిన వెలుతురు లేకపోవడం పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
గత కొన్ని రోజులుగా తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం పూర్తిగా చీకటిలోనే ఉంటున్నప్పటికీ, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉండాల్సిన సమయంలో విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, కార్యాలయానికి తగిన భద్రత కల్పించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.