బావిలో పడిన భారీ మొసలి.. పొలాలకు వెళ్లొద్దని హెచ్చరికలు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో భారీ మొసలి కలకలం సృష్టించింది. మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామానికి చెందిన రైతు వాసం వీరస్వామి వ్యవసాయ బావిలో ఒక భారీ మొసలి ప్రత్యక్షమైంది. బావిలో మొసలిని గమనించిన రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మొసలిని చూసేందుకు తరలివచ్చారు. ఈ ఘటనతో మొండ్రాయిగూడెం, సమీపంలోని ఎంచగూడెం గ్రామ ప్రజలు అప్రమత్తమయ్యారు.
ముఖ్యంగా రైతులు, గొర్ల కాపరులు, చిన్నారులు పొలాలు, చెరువులు, బావుల పరిసర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మొసలి బావిలో ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, దానిని సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
గ్రామాల్లో భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు అవసరం లేకుండా బావుల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.