తెలంగాణ రాష్ట్రం లో ప్రీ ప్రైమరీ పర్యవేక్షణ బాధ్యత హెచ్ఎందే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు లేదా సీనియర్ ఉపాధ్యాయుడు వారానికి ఒకసారి, ముఖ్యంగా ప్రతి శుక్రవారం ప్రీ ప్రైమరీ తరగతిని పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. తరగతి నిర్వహణపై ఇన్స్ట్రక్టర్కు ఫీడ్బ్యాక్ డైరీ ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వాలని పేర్కొంది.
పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ శనివారం ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 1,362 ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించగా, ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 2,769 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడుతున్నారు.
ముఖ్య మార్గదర్శకాలు
ప్రతి చిన్నారికి లిటరసీ, న్యూమరసీకి సంబంధించిన రెండు వర్క్బుక్లు అందజేయాలి.
క్యూఆర్ కోడ్తో కూడిన కథలు, పాటలు, వీడియోలు, స్టోరీ కార్డులను ఉపయోగించి బోధనను ఆసక్తికరంగా నిర్వహించాలి.
ప్రతి తరగతి గదిలో రీడింగ్ కార్నర్, కాగ్నిటివ్ కార్నర్, క్రియేటివ్ కార్నర్, ప్లే కార్నర్లను ఏర్పాటు చేయాలి.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలి.
ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు ప్రార్థన కార్యక్రమం నిర్వహించాలి.
ఉదయం 10.25 నుంచి 10.40 గంటల వరకు చిన్న విరామం ఇవ్వాలి.
ఉదయం 11.50 నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు ఆటల సమయంగా కేటాయించాలి.
ఒకవేళ పాఠశాల మధ్యాహ్నం తర్వాత కూడా కొనసాగితే పిల్లలకు విశ్రాంతి, ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.