Sadum: విధి నిర్వహణలో పోలీసులపై దాడి.. ఇద్దరు నిందితులు అరెస్ట్
అన్నమయ్య జిల్లా | NTODAY NEWS
అన్నమయ్య జిల్లా సదుం పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం, సదుం గాంధీ రోడ్డులోని సాయిబాబా దేవాలయం ఎదురుగా అద్దెకు ఉంటున్న హర్యానాకు చెందిన హితేశ్వర్, రామేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు మాదకద్రవ్యాలు వినియోగిస్తూ అక్రమంగా ఆయుధంతో స్థానికులను బెదిరిస్తున్నారనే సమాచారంతో ఎస్ఐ విష్ణు నారాయణ, కానిస్టేబుల్ సుబ్రమణ్యం, హోంగార్డు చాంద్ బాషా తనిఖీలకు వెళ్లారు.
తనిఖీల సమయంలో అక్కడ హుక్కా మిషన్ను గుర్తించిన పోలీసులు వారిని ప్రశ్నించగా, మత్తులో ఉన్న ఇద్దరు ఒక్కసారిగా ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఇంటిని తనిఖీ చేయగా 10 లీటర్ల నాటుసారా, 18 మద్యం బాటిళ్లు, హుక్కా మిషన్, ఒక బాకు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న సమయంలో స్థానిక బస్టాండ్ వద్ద కొందరు స్థానికులపైనా వారు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డును సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పందిస్తూ, గాయపడిన పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసులపై దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.