ఇంటి మీద వేసిన మట్టిని తొలగించిన రెవెన్యూ సిబ్బంది
చిలంపల్లి మాదిగల ఇళ్లపై వేసిన మట్టిని తొలగించిన రెవెన్యూ సిబ్బంది.
రెవెన్యూ సిబ్బందిపై గొడవకు దిగిన దళిత ఉద్యమ నేత దేవరాజు మాదిగ, భారతీయ అంబేద్కర్ సేన స్టేట్ సెక్రటరీ బాలకృష్ణ.
అగ్రవర్ణ కులస్తులు అడ్డుకున్నప్పటికీ, రెవెన్యూ అధికారులు దగ్గరుండి గ్రామకంఠ భూమిని సర్వే చేసి, ఇళ్లపై ఉన్న మట్టిని తొలగిస్తూ బౌండరీ లైన్ ఏర్పాటు చేశారు.
వివరాల్లోకి వెళితే, గత రెండు నెలల కాలంగా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చిలంపల్లి గ్రామంలో సుమారు 60 కుటుంబాలు మాదిగలు నివాసం ఉంటున్నారు. ఈ గ్రామానికి ఆనుకుని సుమారు మూడు ఎకరాల 42 సెంట్ల గ్రామకంఠం భూమి ఉంది.
ఈ భూమిపై కన్నేసిన అగ్రవర్ణ కులస్తులు దళిత మాదిగల ఇళ్లపై మట్టిని పోసి స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న కుప్పం నియోజకవర్గ దళిత ఉద్యమ నేత దేవరాజు మాదిగ, భారతీయ అంబేద్కర్ సేన స్టేట్ సెక్రటరీ బాలకృష్ణ, శాంతిపురం ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం. రవీంద్ర మాదిగ, కే. పాపన్న మాదిగ, దళిత ఉద్యమ నాయకులు జై చంద్ర, కుమార్, మంజునాథ్, భారతీయ అంబేద్కర్ సేన నియోజకవర్గ నాయకులు మంజునాథ్, మండల నాయకుడు నాగభూషణం తదితరులు తహసీల్దార్ ప్రసన్నకుమార్తో చర్చలు జరిపారు.
భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు అన్యాయం జరుగుతున్నప్పటికీ అధికారులు మౌనంగా ఉండటం సరికాదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాల్సి వస్తుందని వారు గట్టిగా పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్ ప్రసన్నకుమార్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీతో మాట్లాడారు. తక్షణమే మాదిగల ఇళ్లపై ఉన్న మట్టిని తొలగించాలని, గ్రామకంఠం భూమికి సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసుకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం దళిత ఉద్యమ నేత దేవరాజు మాదిగ, భారతీయ అంబేద్కర్ సేన స్టేట్ సెక్రటరీ బాలకృష్ణ, వారి బృందం ఆధ్వర్యంలో జేసీబీని ఏర్పాటు చేశారు. వీఆర్వో రాజేష్, భరణి, మండల సర్వేయర్, వీఆర్ఏ, ఆర్ఐల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి గ్రామకంఠం హద్దులను గుర్తించారు. అనంతరం జేసీబీతో ఇళ్లపై వేసిన మట్టిని తొలగించి బౌండరీ లైన్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అగ్రవర్ణ కులస్తులు, దళిత నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దళితుల ఇళ్లపై మట్టి పోయడం ఏమిటని, ఉన్న కొద్దిపాటి భూముల విషయంలో మాదిగలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని దళిత నాయకులు ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలిపారు.
అనంతరం దళిత ఉద్యమ నేత దేవరాజు మాదిగ, భారతీయ అంబేద్కర్ సేన స్టేట్ సెక్రటరీ బాలకృష్ణ సంయుక్తంగా మాట్లాడుతూ, గ్రామకంఠం స్థలంలో నివాసం ఉంటున్న మాదిగలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇతరులు ఆ స్థలాన్ని ఆక్రమించుకునే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే పరిస్థితి మరోసారి పునరావృతమైతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
రెవెన్యూ సిబ్బంది చర్యలతో మాదిగలకు మనోధైర్యం కలిగిందని, తమ సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.