ముంబై ఆస్పత్రిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. భుజాలకు శస్త్రచికిత్స అవసరమన్న వైద్యులు
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంతకాలంగా భుజాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. రెండు భుజాల్లోని కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో పాటు రొటేటర్ కఫ్ గాయం కారణంగా ఆయన తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆరోగ్య పరీక్షల కోసం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆయనతో పాటు సతీమణి అన్నా లెజ్నేవా కూడా ముంబై వెళ్లారు.
పవన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు రెండు భుజాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని, అనంతరం కొంతకాలం పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచించారు.
అయితే ప్రస్తుతం తనకు అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని పూర్తి చేసిన తర్వాత మళ్లీ ముంబై వచ్చి చికిత్స చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలిపినట్లు సమాచారం. అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆయన మరికొన్ని రోజుల్లో ముంబై వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.