రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ: హరీష్ రావు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇది రైతు ఆశీర్వాద సభ కాదని, రైతు వంచన సభ అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ రైతులకు రూ.12 వేలే ఇచ్చిందని ఆరోపించారు. అందులోనూ ఒక పంట సీజన్కు సంబంధించిన సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టారని విమర్శించారు.
కొన్ని సందర్భాల్లో రెండు ఎకరాల వరకే, మరికొన్ని సందర్భాల్లో మూడు ఎకరాల వరకే రైతు భరోసా పరిమితం చేశారని హరీష్ రావు పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట రైతులకు మొత్తం రూ.29,300 కోట్ల మేర బాకీ పడిందని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.