కుప్పంలో పౌర హక్కుల దినోత్సవం.. దళితుల సమస్యలపై అధికారుల సమీక్ష
కుప్పం | NTODAY NEWS
కుప్పం మండలంలోని మంకలదొడ్డి దళితవాడలో మంగళవారం తహసీల్దార్ రమేష్బాబు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దళితుల సామాజిక, ఆర్థిక, భూ సంబంధిత సమస్యలను అధికారులు తెలుసుకుని వాటిపై చర్చించారు.
సమావేశంలో పాల్గొన్న ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ, రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. ముఖ్యంగా భూముల సమస్యలు, కుల వివక్ష, సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.
సమావేశం అనంతరం తహసీల్దార్ రమేష్బాబు, రెవెన్యూ అధికారులు సంబంధిత భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దళితులకు రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. కుల వివక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేకుండా చట్టాలను కఠినంగా అమలు చేయాలని, పేద దళిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని దళిత ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.