అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే
అనంతసాగరం | NTODAY NEWS
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియలో అనంతసాగరం మండలం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రక్రియ పూర్తి కావడానికి కేవలం 14 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పటివరకు సుమారు 20 శాతం నమోదు మాత్రమే పూర్తయినట్లు సమాచారం.
క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి గణన సమాచార పత్రాలను పంపిణీ చేయాల్సిన బూత్ లెవల్ అధికారులు (BLOలు) అనేక ప్రాంతాల్లో సచివాలయాలకే పరిమితమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని అనేక మంది ఓటర్లకు గణన పత్రాలు అందలేదని తెలుస్తోంది.
అలాగే, గణన సమాచార పత్రాలను పూర్తి చేసి సిద్ధంగా ఉంచినప్పటికీ వాటిని స్వీకరించేందుకు బీఎల్వోలు రావడం లేదని పలువురు ఓటర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఓటర్లలో అయోమయం, అసంతృప్తి నెలకొంటున్నట్లు సమాచారం.
ప్రక్రియను పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని, పర్యవేక్షణ లోపం కారణంగా బీఎల్వోల పనితీరుపై ప్రభావం పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల మండల తహసీల్దార్ సమీక్ష నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు.
ఓటు హక్కుకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం కొనసాగితే అర్హులైన ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించి, లోపాలను వెంటనే సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.