ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం.
న్యూఢిల్లీ | NTODAY NEWS
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల వరకు ఉచిత లోన్ ఇస్తుందంటూ సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికల్లో ప్రచారం జరుగుతున్న ప్రకటనలు పూర్తిగా నకిలీవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. "ప్రధానమంత్రి లోన్ స్కీమ్" పేరుతో వస్తున్న ప్రకటనలను నమ్మవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది.
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఈ నకిలీ ప్రకటనల్లో ఇచ్చే లింక్లపై క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేయడంతో పాటు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, OTP వంటి కీలక సమాచారాన్ని సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ వివరాల ఆధారంగా బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నట్లు కేంద్రం హెచ్చరించింది. అందువల్ల అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకుండా, వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ పంచుకోవద్దని సూచించింది.
సందేహాస్పద ప్రకటనలు, సందేశాలు కనిపించినప్పుడు వాటిని సంబంధిత అధికారులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి వెంటనే ఫిర్యాదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది.