శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం
శ్రీశైలం | NTODAY NEWS
శ్రీశైల దేవస్థానంలో మంగళవారం పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ, దేవస్థానంలో ఉద్యోగుల హోదాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ అందరూ భగవంతుని సేవలో భాగస్వాములేనని అన్నారు. అంకితభావంతో విధులు నిర్వహించిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి విశేష సేవలు అందించారని ప్రశంసించారు.
ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ మాట్లాడుతూ, దేవస్థానంలో సేవ చేసే అవకాశం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొంటూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులను అభినందించారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన వారిలో ఉపప్రధానార్చకులు సి. యోగేంద్రసాయి (34 ఏళ్ల సేవ), పర్యవేక్షకులు డి. రంగన్న (37 ఏళ్ల సేవ), సీనియర్ అసిస్టెంట్ యం. రామనాయుడు (27 ఏళ్ల సేవ), తోటమాలి బి. రంగన్న (37 ఏళ్ల సేవ), స్వీపర్ ఎస్. భ్రమరాంబ (20 ఏళ్ల సేవ)తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు.
కార్యక్రమం ముగింపులో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు శ్రీస్వామి–అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేసి దేవస్థానం ఘనంగా సత్కరించింది. దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యదర్శి పీ.వి. సుబ్బారెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.