'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
చిలకలూరిపేట | NTODAY NEWS
జాతీయ సమగ్ర ఓటర్ల సర్వే (SIR - Special Intensive Revision) విధివిధానాలపై బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
మంగళవారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుతో కలిసి చిలకలూరిపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జులకు నిర్వహించిన 'సర్' అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రాథమిక ఓటరు జాబితా విడుదల నుంచి తుది జాబితా ఖరారయ్యే వరకు ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు డబుల్ ఎంట్రీలు, అనర్హుల ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఎవరి ఓటు హక్కు తొలగించే ఉద్దేశం లేదు: ఎంపీ లావు
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర ఓటర్ల సర్వే (SIR) దేశంలో ఇప్పుడు 11వ సారి నిర్వహిస్తున్న ప్రక్రియ అని తెలిపారు. దీనిని కొత్తగా ప్రారంభించినట్లు కొందరు చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని అన్నారు.
ప్రభుత్వానికి ఎవరి ఓటు హక్కును తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ఆయన, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే మొత్తం ప్రక్రియ కొనసాగుతోందన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 95 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షుడు జవ్వాజి మధన్ మోహన్, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ, బీజేపీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జులు పాల్గొన్నారు.