ఎ. కొండూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఐ కె. గిరిబాబు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎ. కొండూరు పోలీస్ స్టేషన్ను తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. గిరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పరిపాలనా విధానాలు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, కేసు డైరీలు, ఇతర అధికారిక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
దర్యాప్తు పనులు చట్టబద్ధంగా, సమయపాలనతో కొనసాగించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, రోడ్డు భద్రతా నిబంధనలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
అలాగే గ్రామాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను సత్వరమే నమోదు చేసి, చట్టపరమైన చర్యలు వేగంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్న సీఐ కె. గిరిబాబు, స్టేషన్లో రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి. మహాలక్ష్ముడు మరియు పోలీసు సిబ్బంది పనితీరును అభినందించారు. స్టేషన్ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.