కరీంనగర్లో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం
కరీంనగర్లో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలో పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇటీవల తిమ్మాపూర్లో జరిగిన ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదంపై ఇంకా స్పష్టత రాకముందే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన జేబీఎం సంస్థ నిపుణుల బృందం ఇప్పటికీ పూర్తి నివేదికను వెల్లడించలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 అక్టోబర్లో జేబీఎం సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది. అయితే వరుసగా మూడోసారి అగ్నిప్రమాదం జరగడంతో ఈ బస్సుల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా ఘటన నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.