టీడీపీ గద్దె ధ్వంసం: అధికారుల నిర్లక్ష్యం.. కార్యకర్తలు లేరని పట్టించుకోని అధికారులు..
డొంకేశ్వర్ (అన్నారం): డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో గుర్తుతెలియని దుండగులు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జెండా గద్దెను కూల్చివేశారు. గ్రామంలో ప్రశ్నించేందుకు యాక్టివ్ కార్యకర్తలు ఎవరూ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, అధికారులు ఈ ఘటనను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి దుండగులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..గ్రామ నడిబొడ్డున ఉన్న పసుపు జెండా గద్దెను కొందరు అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారనీ.. గ్రామంలో ఉన్న రాజకీయ ప్రశాంతతను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే ఈ చర్యకు ఒడిగట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు..
"కార్యకర్తలు లేకపోతే చట్టం తన పని తాను చేయదా?" అంటూ గ్రామస్తులు అధికారుల అలసత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలాంటి సంఘటనలను చూసీచూడనట్లు వదిలేస్తే భవిష్యత్తులో అల్లరి మూకలు మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అన్నారంలో ధ్వంసమైన గద్దెను పరిశీలించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు