ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో అధికారుల ఆకస్మిక తనిఖీ
డొంకేశ్వర్ (అన్నారం): మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) లింగం, మండల విద్యాశాఖాధికారి (MEO) రామకృష్ణ మరియు మండల ప్రత్యేక అధికారి బుధవారం సంయుక్తంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు తరగతి గదులను, విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని, అంగన్వాడీ కేంద్రాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో MPDO లింగం మాట్లాడుతూ, సమాజ ఆరోగ్యం మెరుగుపడటంలో విద్యాసంస్థలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని నొక్కి చెప్పారు. పాఠశాలల్లో పారిశుధ్య లోపం ఉంటే విద్యార్థులు సులభంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ప్రతి పాఠశాలలోనూ శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని, భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి వ్యత్యాసం రావొద్దని ఆదేశించారు నిబంధనలు పాటించని యెడల కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అనంతరం అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లోని పౌష్టికాహార నిల్వలను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు మరియు చిన్నపిల్లలకు ప్రభుత్వం అందించే బలామృతం, గుడ్లు, ఇతర పోషకాహారాలు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. కేంద్రాల నిర్వహణలో ఏవైనా సమస్యలు లేదా మౌలిక వసతుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అట్టోలి సంజీవ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని అధికారులకు స్థానిక పరిస్థితులను వివరించారు