వి.బి. జిరామ్జీ పథకాన్ని రద్దు చేయాలి – ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఏ చట్టాన్ని పునరుద్ధరించాలి: వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని ఉపాధి హామీ పని ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు వి.బి. జిరామ్జీ పేరుతో కొత్త విధానాన్ని తీసుకువస్తోందని ఆరోపించారు.
ఉపాధి హామీ చట్టం అమలును బలహీనపర్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కొత్త విధానం ఉందని, రెండు ఫోటోల విధానం కూడా అదే కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి కూలీలు ఐక్యంగా పోరాడి ఈ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం విస్సన్నపేట, కొండపర్వ, తాతకుంట్ల గ్రామాల్లో ఉపాధి కూలీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తర్వాత ఏపీఓ రామారావుకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకుడు మేకల జ్ఞానరత్నం, సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.