ఎల్లారెడ్డిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి, మరొకరికి స్వల్ప గాయాలు
ఎల్లారెడ్డిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి, మరొకరికి స్వల్ప గాయాలు
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామ శివారులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నార్కట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారం నరేష్, గాదే కళ్యాణ్ రెడ్డిలు స్కోడా కారు లో మిర్యాలగూడ నుండి హైదరాబాద్ వైపు బయలుదేరారు. ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో ఎల్లారెడ్డిగూడెం సమీపానికి చేరుకోగానే, ముందుకు వెళ్తున్న ఒక లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి లారీ వెనుక మూల భాగాన్ని బలంగా ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ తీవ్ర ప్రమాదంలో కారు నడుపుతున్న గాదే కళ్యాణ్ రెడ్డి తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు అని తెలిపారు. కారులో ఉన్న అతని స్నేహితుడు మారం నరేష్ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే నార్కట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి ఎస్సై పి .విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు...