ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్
చిత్తపూరులో హరినాథ్ విమర్శలు.. ఉపాధి హామీ యాప్ తొలగించాలని డిమాండ్
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ తెలిపారు. మోడీ చెప్పిన “అచ్చా దిన్” కార్పొరేట్ సంస్థలు ఆదాని, అంబానీలకే వచ్చిందని, సామాన్య ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. మోడీ పాలనలో పేదవాడు కనీసం తాళిబొట్టు కూడా కొనలేని దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా సామ్రాజ్యవాదానికి కేంద్ర ప్రభుత్వం దాసోహం కావడం వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. కరోనా తరహా ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందని ప్రధాని హెచ్చరికలు చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు.
పెద్ద కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం దారుణమన్నారు. ఉపాధి హామీ పనుల్లో రెండు పూటలా ముఖ ఆధారిత హాజరు నిబంధన కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఇటీవల నలుగురు కార్మికులు ప్రమాదంలో మరణించిన ఘటన బాధాకరమన్నారు. వెంటనే ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేసి, ఉపాధి కార్మికుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
చిత్తపూరు, రమణక్కపేట తదితర గ్రామాల్లో అటవీ భూములపై జారీ చేసిన 4 నోటిఫికేషన్ను రద్దు చేసి సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. చిత్తపూరు గ్రామంలో స్మశాన భూమి సమస్యను పరిష్కరించి, ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.