గ్రామ సుభిక్షం కోసం పెనుగొలనులో అభిషేకాలు, నగర సంకీర్తన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం లోని పెనుగొలను గ్రామంలో గ్రామ సుభిక్షం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని బాహుబలి శివలింగానికి భక్తులు జలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి రేడియా సెంటర్, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ భగవన్నామ స్మరణతో గ్రామ వీధుల్లో ప్రదర్శన చేపట్టారు.
బొడ్రాయి, ఆంజనేయస్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి బాబా సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, పాశం వెంకటేశ్వర్లు, మైలవరపు ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, శనివారం రాత్రి గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ బొడ్రాయి సెంటర్లోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించినట్లు భక్త బృందం కమిటీ సభ్యులు బొలగాని నాగయ్య, కోట దాసు తెలిపారు.