ఇంకా వీడని జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. 29 రోజులైనా ఆచూకీ లేదు
కాకినాడ జిల్లా తునిలో 29 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నారి కోసం తల్లిదండ్రులు కళ్లల్లో ఆశతో ఎదురుచూస్తుండగా, స్థానికుల్లోనూ తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
చిన్నారి తల్లి భవాని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, "ఎవరైనా నా పాపను తీసుకెళ్లి ఉంటే దయచేసి సురక్షితంగా అప్పగించండి. మీపై ఎలాంటి కేసులు పెట్టను. నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చేయండి" అంటూ వేడుకున్నారు. తల్లి ఆర్తనాదం స్థానికులను కలచివేస్తోంది.
ఇదిలా ఉండగా, చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలు, ఇతర కీలక సమాచారాన్ని పరిశీలిస్తూ విచారణను వేగవంతం చేసినట్లు సమాచారం.
దాదాపు నెలరోజులు గడిచినా చిన్నారి ఆచూకీ లభించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని ప్రజలు, బంధువులు ప్రార్థిస్తున్నారు. అయితే ఈ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారడంతో చిన్నారి కోసం అన్వేషణ మరింత ఉత్కంఠగా మారింది.