జలంధర్లో సెప్టెంబర్ 20, 21 తేదీల్లో అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ మహాసభలు
అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేఎం) జాతీయ మహాసభలు 2026 సెప్టెంబర్ 20, 21 తేదీల్లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జాతీయ కార్యదర్శి డి. హరినాథ్ తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జుంఝనూలో జరిగిన జాతీయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఢిల్లీ నుంచి చరవాణి ద్వారా వెల్లడించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జన్మించిన పంజాబ్ గడ్డపై జరగనున్న ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాల వల్ల భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, ఈ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వేలాది ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రైతు సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇటీవల యూరియా సరఫరాపై తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేసి రైతులకు ఒకేసారి అవసరమైన యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు సి2+50 శాతం గిట్టుబాటు ధర కల్పించాలని, కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసే ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగానికి కూడా రుణమాఫీ ప్రకటించాలని కోరారు.
అలాగే 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని, సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అటవీ భూములను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించిన హరినాథ్, "వ్యవసాయాన్ని, భూమిని, రైతును కాపాడుకుందాం" అంటూ పిలుపునిచ్చారు.