క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
హైదరాబాద్ | ఆగస్టు 7 | NTODAY NEWS
1942 ఆగస్టు 9న జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో మహిళలు పోషించిన పాత్ర స్ఫూర్తిగా, నేటి మహిళల సమస్యల పరిష్కారం కోసం మహిళలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని జియగూడ భీమ్నగర్ బస్తీలో "క్విట్ ఇండియా ఉద్యమంలో మహిళల పాత్ర" అనే అంశంపై ఐద్వా హైదరాబాద్ సౌత్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా మల్లు లక్ష్మీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలే మార్గమని పేర్కొన్నారు. మహిళలు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మరింత చైతన్యంతో ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు పి. శశికళ, స్వరూప, కవితతో పాటు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.