క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన తెలియజేయవచ్చు...
పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్
1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా అర్జీల స్థితి తెలుసుకోవచ్చు
మదనపల్లి | ఆగస్టు 30 | Ntoday News
ప్రజా సమస్యల పరిష్కార వేదిక **(పీజీఆర్ఎస్)**ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ఈ నెల 31న సోమవారం జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు తమ సమస్యలపై నేరుగా సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే మీకోసం వెబ్సైట్ (Meekosam.ap.gov.in) ద్వారా కూడా తమ సమస్యలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
పీజీఆర్ఎస్కు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి అర్జీకి సంబంధించిన వివరాలు, పరిష్కార పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా స్పందనను తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను ముందుగా గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులు మాత్రమే జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలను నిర్ణీత విధానంలో నమోదు చేసి, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకునేలా పీజీఆర్ఎస్ వేదికను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.
— డీఐపీఆర్ఓ, అన్నమయ్య జిల్లా