మచిలీపట్నంలో మైనర్ బాలికలపై లైంగిక దాడి
మచిలీపట్నంలో మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆటో డ్రైవర్లు, వారి స్నేహితుడిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం
మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్లతో పాటు వారి పరిచయస్తుల పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధిత బాలికలు పెడన మండలం బల్లిపర్రులోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నట్లు సమాచారం.
పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈ నెల 6వ తేదీన బాలికలు గురుకుల పాఠశాల నుంచి మచిలీపట్నం వచ్చారు. అక్కడ శారదానగర్కు చెందిన తమకు పరిచయమున్న వ్యక్తికి ఫోన్ చేశారు. అనంతరం ఆటోలో కోనేరు సెంటర్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆటో డ్రైవర్ మరో వ్యక్తి సహాయంతో బాలికలను తీసుకెళ్లినట్లు సమాచారం.
అనంతరం బాలికలను రుద్రవరం ప్రాంతంలోని నిర్మానుష్యంగా ఉన్న టిడ్కో గృహాల వద్దకు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆటో డ్రైవర్తో పాటు అతని స్నేహితుడు బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితులు వెల్లడించినట్లు సమాచారం. ఘటన అనంతరం బాలికలు తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.
మరుసటి రోజు ఓ బాలిక రక్తస్రావంతో అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసి ఆరా తీశారు. దీంతో బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పెడన పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. బాధిత బాలికల నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఘటనకు సంబంధించిన పరిస్థితులు, బాలికలు మచిలీపట్నం చేరుకున్న విధానం, వారిని రుద్రవరం ప్రాంతానికి తీసుకెళ్లిన వ్యక్తులు, ఘటన జరిగిన ప్రదేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
పెడన, బందరు రూరల్ పోలీస్ అధికారులు సమన్వయంతో దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడంతో పాటు అనుమానితుల కదలికలు, ఫోన్ సంభాషణలు, ఇతర ఆధారాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఇరు పోలీస్ స్టేషన్ల అధికారులు కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
బాధితులు మైనర్ బాలికలు కావడంతో వారి గుర్తింపును పోలీసులు, అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఘటనలో అసలు నిందితులు ఎవరు, ఎంతమంది ప్రమేయం ఉంది, బాలికలను ఏ పరిస్థితుల్లో తీసుకెళ్లారు అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.