మల్లెల శివారులో జూద శిబిరంపై తిరువూరు పోలీసుల మెరుపు దాడి
ఆరుగురు అరెస్టు.. రూ.16,650 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మల్లెల గ్రామ శివారులో నిర్వహిస్తున్న జూద శిబిరంపై తిరువూరు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టానికి విరుద్ధంగా నగదు పణంగా కోతముక్క జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు తిరువూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శాతకర్ణి సిబ్బందితో కలిసి ఆదివారం మధ్యాహ్నం మల్లెల గ్రామ శివారులో ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా జూదం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.16,650 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జూదాలకు దూరంగా ఉండాలి: పోలీసులు
ప్రభుత్వం నిషేధించిన జూద కార్యకలాపాల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. జూదాలు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడంతో పాటు సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ జూద కార్యకలాపాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.